IRCTC: నడుస్తాయో లేదో తెలియదుగానీ... 15 నుంచి రైళ్లన్నీ ఫుల్!

  • గత నెల 22 నుంచి ఆగిన రైళ్లు
  • నాలుగు రోజుల నుంచి మొదలైన రిజర్వేషన్లు
  • 15, 16 తేదీల్లో రైళ్ల రిజర్వేషన్లు పూర్తి
Trains Full From April 15

లాక్ డౌన్ కారణంగా గత నెల 22 నుంచి దేశవ్యాప్తంగా రైళ్లన్నీ నిలిచిపోయాయి. ఈ లాక్ డౌన్ 14వ తేదీతో ముగియనుంది. ఓ వైపు లాక్ డౌన్ కొనసాగుతుందని, మరోవైపు తొలగిస్తారని వార్తలు వస్తున్నా, కేంద్రం నుంచి ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక, ఒకసారి లాక్ డౌన్ ను తొలగించి, రైళ్లు నడిస్తే, మాత్రం కిటకిటలాడిపోతాయనడంలో సందేహం లేదు.

ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా నాలుగు రోజుల క్రితమే రైల్ రిజర్వేషన్ ప్రారంభం కాగా, 15, 16 తేదీలకు దాదాపు అన్ని రైళ్లకూ బుకింగ్స్ పూర్తికాగా, కొన్ని రైళ్లలో 100 వరకూ వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చి, తిరిగి వెనక్కు వెళ్లలేకపోయిన వారు ఈ టికెట్లను బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ లాక్ డౌన్ కొనసాగినట్లయితే, ఆన్ లైన్ లోనే టికెట్ల రద్దునకు అవకాశం ఉండటంతో, ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో టికెట్లను ప్రయాణికులు బుక్ చేసుకుంటున్నారు.

ఇక ఈ వేసవిలో పిల్లా జెల్లాతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేసుకున్న వారిలో అత్యధికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవడంతో, కొన్ని రైళ్లలో మే, జూన్ నెల ప్రయాణాలకు టికెట్లు కనిపిస్తున్నాయి. ఇక రైళ్లు తిరుగుతాయా? తిరగవా? అన్న విషయాన్ని 10వ తేదీ తరువాత కేంద్రం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, దేశంలో కరోనా వ్యాప్తి తదితరాలను సమీక్షించిన తరువాతే లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో మోదీ సర్కారు ఉంది. 

More Telugu News