Hydroxychloroquine: ఆ మందులు పంపకుంటే ఇండియాపై బదులు తీర్చుకుంటాం: డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

  • హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను పంపాలని కోరిన యూఎస్
  • ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోని ఇండియా
  • పంపకుంటే చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరిక
Trump Warns Possible Retaliation on India

తాము కోరినట్టుగా మలేరియా నివారణకు వినియోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ ను యూఎస్ కు ఎగుమతి చేయకుంటే, భారత్ పై బదులు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్ హౌస్ లో జరిగిన కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ బ్రీఫింగ్ లో మాట్లాడిన ఆయన, అమెరికా, ఇండియా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని, అయితే, యూఎస్ ఆర్డర్ ఇచ్చినట్టుగా మెడిసిన్ ను ఎందుకు పంపించడం లేదన్న కారణం మాత్రం తెలియడం లేదని ఆయన అన్నారు.

"అది నరేంద్ర మోదీ నిర్ణయమని నేనేమీ అనుకోవడం లేదు. ఇతర దేశాలకు కూడా దాని ఎగుమతిని నిలిపివేసినట్టు మోదీతో ఫోన్ లో మాట్లాడిన వేళ నాకు తెలిసింది. ఆయనతో సంభాషణ నాకు సంతోషాన్ని ఇచ్చింది. అమెరికా కోరిక మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను విడుదల చేస్తారనే అనుకుంటున్నా" అని అన్నారు. ఇరు దేశాల మధ్యా వాణిజ్యపరంగా సత్సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన ఆయన, ఒకవేళ ఔషధాన్ని పంపకుంటే, ఏం చేయాలన్న విషయాన్ని ఆలోచిస్తామని, పరిస్థితిని బట్టి యూఎస్ నిర్ణయాలుంటాయని అన్నారు.

కాగా, మలేరియా నివారణకు వినియోగించే ఈ టాబ్లెట్లు కరోనా వైరస్ ను నియంత్రించడంలో ఉపకరిస్తుండటంతో, దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ఇండియాలో ఈ ఔషధం విరివిగా తయారవుతూ, సాధారణ మెడికల్ షాపుల్లోనూ లభించే పరిస్థితి వుంది. దీంతో పలు దేశాలు తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను పంపించాలని ఇండియాను కోరుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఈ మెడిసిన్ ఎగుమతిపై ఇండియాలో నిషేధం అమలులో ఉంది.

More Telugu News