Tamilnadu: తమిళనాడులో 621కి చేరిన ‘కరోనా’ కేసుల సంఖ్య

  • ఇవాళ మరో 50 పాజిటివ్ కేసుల నమోదు
  • ఇద్దరు మినహా మిగిలిన వాళ్లందరూ ఢిల్లీ వెళ్లొచ్చిన వారే
  • కార్పొరేషన్ వర్కర్లు ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు
corona cases increased in Tamilnadu

తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 621కి చేరింది. ఇవాళ మరో 50 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేష్ మాట్లాడుతూ, ఈరోజు నమోదైన యాభై కేసులలో ఇద్దరు మినహాయించి మిగిలిన వ్యక్తులందరూ ఢిల్లీలో తబ్లిగీ జమాత్ కాన్ఫరెన్స్ కు హాజరైన వారేనని చెప్పారు.

 రాష్ట్రంలో పదకొండు లక్షల మంది నివాసితులు పర్యవేక్షణలో వున్నారని, దాదాపు నలభై లక్షల మందికి పైగా ప్రజలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. కార్పొరేషన్ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి, ఒకవేళ ఈ మధ్య కాలంలో వారు ఏమైనా ప్రయాణాలు చేసి ఉంటే వాటి గురించి తెలుసుకుంటున్నారని చెప్పారు.

చైనాకు ఆర్డర్ ఇచ్చిన టెస్టింగ్ కిట్స్ 8న రావొచ్చు: సీఎం పళనిస్వామి

రాష్ట్రంలో ‘కరోనా’ టెస్టింగ్ పరీక్షలను వేగవంతం చేసే నిమిత్తం చైనాకు ఒక లక్ష టెస్టింగ్ కిట్స్ ను ఆర్డర్ ఇచ్చినట్టు సీఎం పళనిస్వామి తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.500 కోట్ల ఆర్థికసాయం పొందినట్టు చెప్పారు.  ఈ నెల 8వ తేదీ నాటికి టెస్టింగ్స్ కిట్స్ రాష్ట్రానికి చేరే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో మరో 21 టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరినట్టు తెలిపారు.

మొబైల్ వెజిటబుల్ షాప్స్ ను ప్రవేశపెట్టాలన్న యోచనలో తమ ప్రభుత్వం ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ‘కరోనా’ ప్రభావం మేరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అనే విషయమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 టెస్టింగ్ సెంటర్స్ ఉండగా, అందులో 11 ప్రభుత్వానికి చెందినవి కాగా 6 ప్రైవేట్ సెక్టార్ కు చెందినవి.

More Telugu News