Mumbai: సభ్యతలేని వారికి చికిత్స అవసరమా...అదే సరైన శిక్ష : ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు

  • ఘజియాబాద్‌ ఆసుపత్రిలో తబ్లిగీ జమాత్‌ సభ్యుల తీరుపై మండిపాటు
  • నర్సులను వేధించడం ఏం తీరని ప్రశ్న
  • వారిని కాల్చి చంపినా తప్పులేదని వ్యాఖ్యలు
rajthkre fires on tabligi jamat members in ghajiyabad hospital

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారికి చిత్తశుద్ధితో సేవలందిస్తున్న నర్సులపట్ల అసభ్యంగా ప్రవర్తించిన తబ్లిగీ జమాత్‌ సభ్యులపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌ఠాక్రే ఆగ్రహోదగ్రులయ్యారు. ఢిల్లీలో జరిగిన మత సమావేశానికి హాజరైన పలువురు కరోనా వైరస్‌ బారిన పడినట్లు తేలడంతో బాధితులను ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. ఘజియాబాద్‌ ఆసుపత్రిలో చేర్చిన ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు నర్సులపట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు కూడా నర్సులను వారు వేధించడం వాస్తవమేనని తేల్చారు.

ఈ నేపథ్యంలో జమాత్ సభ్యుల తీరుపై రాజ్‌ఠాక్రే మండిపడ్డారు. ‘అటువంటి వారికి చికిత్స అవసరమా. తమకు వైద్య సేవలందిస్తున్న వారినే వేధించడం అంటే వారి గురించి ఏమనుకోవాలి. ఆసుపత్రిలో ఫ్యాంటు విప్పి అర్ధనగ్నంగా తిరగడం, నర్సుపట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఏం సంస్కారం. ఇటువంటి వారిని కాల్చిచంపినా తప్పులేదు’ అంటూ వ్యాఖ్యానించారు. రాజ్‌ఠాక్రే వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేగుతోంది.

More Telugu News