Lockdown: ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు ప్రభుత్వమే వేతనం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్

  • విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం
  • దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు
  • తదుపరి విచారణ ఈ నెల 7వ తేదీకి వాయిదా
Petition in Supreme Court for remuneration for migrant workers who lost their jobs

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సామాజిక కార్యకర్తలు హర్ష మాందర్, అంజలి భరద్వాజ్ ఈ పిటిషన్ వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా వలస కార్మికులు, కూలీలు ఉపాధి కోల్పోయారని, దాంతో తినడానికి తిండిలేక వారు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

అలాంటి వారికి కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు వేతనాలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను ఈ నెల ఏడో తేదీకి వాయిదా వేసింది.

More Telugu News