Corona Virus: రక్త మార్పిడితో కరోనాకు చెక్‌.. అమెరికాలో ప్రయోగం!

  • వైరస్‌ నుంచి కోలుకున్న వ్యక్తి రక్తం మరో బాధితుడికి మార్పిడి 
  • కోలుకున్న వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువ
  • వందేళ్ల క్రితం ‘స్పానిష్ ఫ్లూ’ వ్యాధికి ఇలానే చికిత్స
new treatment for corona with blood change

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రాణాంతక వైరస్‌ నివారణకు వ్యాక్సిన్‌, మందులు కనుగొనేందుకు ఎన్నో ప్రయోగశాలలు బిజీగా ఉన్నాయి. అలాగే, వైరస్ బారిన పడిన వారిని రక్షించేందుకు మెరుగైన వైద్య చికిత్స కోసం కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ ఆసుపత్రి కొత్త చికిత్సను అవలంబిస్తోంది. కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తి రక్తాన్ని ఇప్పుడు వైరస్‌తో పోరాడుతున్న బాధితుడికి మార్పిడి చేయడం ద్వారా చికిత్స కోసం ప్రయత్నిస్తున్నట్టు హూస్టన్‌లోని మెథడిస్ట్ ఆసుపత్రి తెలిపింది.

కరోనా నుంచి కోలుకున్నాక రెండు వారాల పాటు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రక్తంలోని ప్లాస్మాతో చికిత్స ప్రారంభించినట్టు చెప్పింది. వందేళ్ల క్రితం వచ్చిన ‘స్పానిష్ ఫ్లూ’ వ్యాధికి కూడా ఇలానే చికిత్స చేశారని మెథడిస్ట్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది వైరస్‌పై దాడి చేయడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల అభిప్రాయం.

కరోనాకు గురైన రోగులకు సహాయక చర్యలు చేయడం మినహా మరే ప్రత్యేక  చికిత్స చేయలేకపోతున్నారని, అందుకే ‘కాన్‌వాలెసెంట్‌ సెరెమ్ థెరపీ’ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నట్టు మెథడిస్ట్ ఆసుపత్రి చెప్పింది.
ఇందుకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు మెథడిస్ట్ శాస్త్రవేత్త డాక్టర్ ఎరిక్ సలాజార్ ప్రకటించారు.

తమ దేశంలో కరోనా మరణాలు రెండు వేలు దాటడంతో ఈ ప్రయోగాన్ని వేగవంతం చేశామన్నారు. కరోనా నుంచి కోలుకొని తమ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 205 మంది నుంచి బ్లడ్ ప్లాస్మా సేకరించే పనిలో ఉన్నట్టు తెలిపారు. ఈ చికిత్సలో ‘కాన్‌వాలెసెంట్‌ సెరమ్ థెరపీ’ ఉపయోగపడుతుందని తేలితే తమ శక్తి మొత్తం దానిపైనే కేంద్రీకరిస్తామని ఆసుపత్రి సీఈఓ స్పష్టం చేశారు.

More Telugu News