Corona Virus: ప్రపంచవ్యాప్తంగా ఏడు లక్షలకు చేరిన కరోనా కేసులు.. ఇటలీలో సూపర్ మార్కెట్ల లూటీ!

  • ప్రపంచవ్యాప్తంగా 32 వేల మందికిపైగా మృతి
  • ఇటలీలో మృతులను పూడ్చేందుకు శవపేటికల కరవు
  • స్పెయిన్‌లో కరోనా కరాళ నృత్యం
corona cases crossed 7 lakh world wide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఏడు లక్షలకు చేరువ అవుతోంది. కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 32 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా గుప్పిట్లో యూరప్ దేశాలు విలవిల్లాడుతున్నాయి. మొత్తం మరణాల్లో సగం ఇటలీ, స్పెయిన్‌లలోనే నమోదు కావడం ప్రపంచదేశాలను కలవరపెడుతోంది. నిజానికి బాధితుల సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

 మరోవైపు, ఇటలీ ప్రజలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జనం తిండిలేక సూపర్ మార్కెట్లను లూటీ చేస్తున్నారు. దీంతో పోలీసులు తుపాకులతో కాపలా కాస్తున్నారు. కరోనాతో మృతి చెందినవారి సంఖ్య ఇటలీలో పదివేలు దాటిపోయింది. మృతులను పూడ్చిపెట్టేందుకు శవపేటికలు కూడా దొరకని దుర్భర పరిస్థితులు ఉన్నాయి.

పరిస్థితి అదుపుతప్పడంతో తమను ఆదుకోవాలంటూ ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌ సహా మరో ఆరు దేశాలు యూరోపియన్ యూనియన్‌ను వేడుకున్నాయి. స్పెయిన్‌లోనూ కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. అక్కడ ఒక్క రోజులోనే 838 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,528కి చేరుకుంది. 78,797 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి.  

More Telugu News