Hyderabad: వలస కార్మికులు, విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు
  • ఎక్కడికక్కడ చిక్కుకున్న వారికి ఇబ్బందులు
  • లాక్‌డౌన్‌ సమయంలో వారి బాధ్యత ప్రభుత్వాలదే
State governments should take care about labour and students

పలు రాష్ట్రాల్లో పనుల కోసం వెళ్లిన వలస కార్మికులు, చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా ఎటూ వెళ్లలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, వారి ఆలనాపాలనా చూడాల్సిన  బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

కార్మికులను పనిచేసే చోట ఉండనివ్వడం లేదని, సొంతూర్లకు వెళ్లేందుకు మార్గం లేదని, దీంతో ఆకలితో అలమిటిస్తున్నారన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అలాగే, పలు నగరాల్లో చదువుకుంటున్న విద్యార్థులను వసతి గృహాల నిర్వాహకులు బయటకు పంపేస్తుండడంతో వారు కూడా దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వారి ఆహారం, వసతి, సామాజిక దూరం పాటించడానికి తగిన సౌకర్యాలు కల్పించవలసిందిగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు భారత ప్రభుత్వ హోం శాఖ సూచనలు జారీ చేసింది.

More Telugu News