Corona Virus: ప్రియురాలి కోసం క్వారంటైన్ నుంచి పరారైన యువకుడు... ఇద్దర్నీ తీసుకువచ్చి క్వారంటైన్ లో వేసిన అధికారులు!

  • తమిళనాడులో ఘటన
  • ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన యువకుడు
  • కరోనా అనుమానంతో క్వారంటైన్
  • ప్రియురాల్ని కలవడంతో ఆమెకూ తప్పని క్వారంటైన్
Tamilnadu youth escaped from quarantine to meet girl friend

తమిళనాడులో ఆసక్తికర సంఘటన జరిగింది. మధురై ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కొన్నిరోజుల కిందట దుబాయ్ నుంచి వచ్చాడు. కరోనా ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో ఆ యువకుడ్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అప్పటికే ఆ యువకుడు శివగంగకు చెందిన ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. వారి ప్రేమకు అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు.

అయితే, క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ఆ యువకుడు విరహం భరించలేకపోయాడు. ప్రియురాలిని చూసేందుకు క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయాడు. దాంతో వైద్య సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించి అతడి కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు ప్రియురాలి ఇంట్లో ఉన్న అతడిని గుర్తించారు. అతడు కరోనా అనుమానితుడు కావడంతో, ఆ యువతిని కలిసిన నేపథ్యంలో ఆమెకు కూడా కరోనా సోకుతుందేమోనన్న అనుమానంతో ఇద్దరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అంతేకాదు, క్వారంటైన్ నియమావళి ఉల్లంఘించాడంటూ ఈ యువకుడిపై కేసు నమోదు చేశారు.

More Telugu News