Corona Virus: ప్రభుత్వ ఆఫీసుల దగ్గర కరోనా స్క్రీనింగ్.. జాగ్రత్తలు, మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

  • విజిటర్స్ పాస్ లు రద్దు చేయాలి
  • వీలైనంత తక్కువ మందితోనే సమీక్షలు, సమావేశాలు
  • దరఖాస్తుల స్వీకరణ, సమాచారం ఇవ్వడం ఎంట్రీ పాయింట్ లోనే జరగాలి
  • కరోనా వైరస్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
corona preventive measures at Government offices

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. మంత్రులు, అధికారులు, ప్రభుత్వ కార్యాలయాలకు దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. వీలైనంత వరకు ఎవరూ ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని.. జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించింది. ఉద్యోగుల్లో పెద్ద వయసు వారు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. అలాంటి వారికి నేరుగా ప్రజలతో అనుసంధానం ఉండే పనిని అప్పగించవద్దని ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది.

ప్రభుత్వ ఆఫీసులకు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలివీ..

  • ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు ఏర్పాటు చేయాలి

  • తప్పనిసరిగా శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.

  • కార్యాలయాలకు వచ్చే సందర్శకుల సంఖ్యను వీలైనంత వరకు కట్టడి చేయాలి.

  • వెంటనే అన్ని ప్రభుత్వ కార్యాలయాల విజిటర్ పాస్ లను రద్దు చేయాలి.

  • ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవడం, ఏదైనా సమాచారం ఇవ్వడం వంటివి ఆఫీసుల ఎంట్రీ పాయింట్ వద్ద నుంచే చేయాలి.

  • అధికారుల అనుమతితోనే సందర్శకులను లోపలికి అనుమతించాలి. అది కూడా స్క్రీనింగ్ చేశాకే పంపాలి.

  • ప్రభుత్వ అధికారులు సమావేశాలను వీలైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా జరుపుకోవాలి. తప్పనిసరైతే వీలైనంత తక్కువ మందితోనే సమీక్షలు, సమావేశాలు ఉండాలి.

  • అన్ని స్థాయుల అధికారులు కూడా అవసరం లేని అధికారిక ప్రయాణాలు రద్దు చేసుకోవాలి.

  • అవసరమైన సమాచారాన్ని ఫైళ్లు, డాక్యుమెంట్ల రూపంలో ఇతర కార్యాలయాలకు పంపవద్దు. వాటి ద్వారా కరోనా వైరస్ వ్యాపించవచ్చు. అందువల్ల ఈ మెయిల్ విధానాన్ని ఉపయోగించుకోవాలి.

  • ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఉన్న జిమ్ లు, శిశు సంరక్షణ కేంద్రాలను మూసివేయాలి.

  • ఉద్యోగులు పనిచేసే చోట తరచుగా శుభ్రం చేయాలి, శానిటేషన్ చేసుకోవాలి.

  • శ్వాస సంబంధమైన ఇబ్బందులు, జ్వరం, అస్వస్థత ఉంటే సదరు ఉద్యోగులు ముందు అక్కడి నుంచి వెళ్లిపోవాలి. తర్వాత పై అధికారులకు సమాచారం ఇవ్వాలి. అలాంటి వారు హోం క్వారంటైన్ లో ఉండాలి.

  • సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నవారికి వెంటనే పై అధికారులు  సెలవు  మంజూరు చేయాలి

  • సీనియర్ ఉద్యోగులు, గర్భిణులు, తీవ్రమైన వ్యాధులున్న ఉద్యోగులకు ప్రజలతో కలిసే పనులను అప్పగించవద్దు.

More Telugu News