KCR: తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రినని కేసీఆర్ గుర్తుంచుకోవాలి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

  • కేసీఆర్ గజ్వేల్ కు మాత్రమే సీఎం కాదు
  • ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు
  • రాష్ట్రం చేస్తున్న అప్పులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్
BJP Mla Rajasingh Comments On CM Kcr in Assembly

తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినని కేసీఆర్ గుర్తుంచుకోవాలని.. ఆయన కేవలం గజ్వేల్ నియోజకవర్గానికి మాత్రమే సీఎం కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని, అవేవీ సరిగా అమలు చేయడం లేదని రాజాసింగ్ ఆరోపించారు. ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య ఏమైందని, ఇప్పటివరకు ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్రాన్ని విమర్శించడం మానుకోండి

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందని, సీఎం కేసీఆర్ ప్రతిసారి కేంద్రాన్ని విమర్శించడం మానుకోవాలని రాజాసింగ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చాలా పథకాల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ వాసిగా తాను రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిజంగా రాష్ట్రానికి సాయం చేయకపోతే నిలదీద్దామని పేర్కొన్నారు. అన్ని పార్టీలతో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాలని, తాను కూడా వస్తానని చెప్పారు.

More Telugu News