Road Accident: స్నేహితురాలి పెళ్లికి వెళ్లొస్తూ.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

Speed kills Three in Nizamabad district
అతివేగం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. నిజామాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన.  జిల్లాలోని మోపాల్ మండలం బాడ్సి గ్రామానికి చెందిన బాలకృష్ణ (21), గౌతంరెడ్డి (20), నిజామాబాద్‌కు చెందిన నిఖిల్ కుమార్ (20)లు మరో ముగ్గురు స్నేహితులతో  కలిసి కారులో దర్పల్లిలో జరిగిన చిన్ననాటి స్నేహితురాలి వివాహానికి వెళ్లారు. పెళ్లిలో ఆనందంగా గడిపిన వారంతా సాయంత్రం తిరిగి బయలుదేరారు.

ఈ క్రమంలో ఇందల్‌వాయి పోలీస్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో యువకులందరూ తీవ్రంగా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారందరినీ వెంటనే నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలకృష్ణ, గౌతంరెడ్డి, నిఖిల్ కుమార్ ప్రాణాలు విడిచారు. మరో స్నేహితుడు సాయిసాకేత్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
Road Accident
Nizamabad District
Telangana

More Telugu News