Narendra Modi: దానిని కూడా ఆయన తప్పుబడుతున్నారు: మన్మోహన్‌పై మోదీ విమర్శనాస్త్రాలు

  • ‘భారత్ మాతా కీ జై’ నినాదాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న మన్మోహన్
  • కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ
  • స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా నేరంగా పరిగణించడం బాధాకరమని వ్యాఖ్య
PM Narendra Modi Criticize Ex PM Manmohan Singh On Vande Mataram

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని నరేంద్రమోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘భారత్ మాతాకీ జై’ అన్న నినాదాన్ని కూడా ఆయన తప్పుబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న దేశ రాజధానిలో నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

స్వాతంత్య్ర పోరాట సమయంలో వందేమాతరాన్ని పాడితే నేరంగా భావించేవారని, ఇప్పుడు ‘భారత్ మాతా కీ జై’ నినాదాన్ని తప్పుబడుతున్నారని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ఈ నినాదాన్ని నేరంగా పరిగణించడం బాధాకరమని ప్రధాని అన్నారు. ప్రధానిగా పనిచేసిన ఓ వ్యక్తి ఇలా అనడం మరింత దురదృష్టకరమన్నారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు అనేక శక్తులు పనిచేస్తున్నాయన్న మోదీ.. వాటిని ఎదుర్కోవడంపై దృష్టి సారించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

కాగా, ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ..‘భారత్ మాతా కీ జై’ నినాదాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నివసిస్తున్న లక్షలాదిమందిని తరిమికొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మన్మోహన్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ప్రధాని మోదీ పై వ్యాఖ్యలు చేశారు.

More Telugu News