ipl 2020: విజిల్‌పోడు.. తాలా వచ్చేశాడు మరి!

  • ఐపీఎల్‌ కోసం చెన్నై చేరిన ధోనీ
  • ఘన స్వాగతం పలికిన సూపర్‌‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ
  • రేపటి నుంచి ప్రాక్టీస్‌ చేయనున్న మహీ
MS Dhoni arrives in Chennai for ipl 2020

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి చెన్నైలో ఎంత క్రేజ్‌ ఉందో చెప్పక్కర్లేదు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌‌ కింగ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిలిపిన ధోనీని అక్కడి ఫ్యాన్స్‌.. తాలా, తలైవా అని పిలుస్తారు. మహీ కోసం చెన్నై ప్రాక్టీస్‌ మ్యాచ్‌లకు సైతం వేల సంఖ్యలో స్టేడియాలకు వస్తుంటారు. అలాంటి అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు మహేంద్రుడు చెన్నపట్నంలో అడుగుపెట్టాడు. ఈ నెల 29న మొదలయ్యే ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం ధోనీ చెన్నై చేరుకున్నాడు. భారీ భద్రత నడుమ చెన్నై ఎయిర్‌‌పోర్టులో దిగిన అతనికి ఘన స్వాగతం లభించింది.  చెన్నై సూపర్‌‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ అతనికి టీమ్‌ హోటల్లో సాదర స్వాగతం పలికింది. టీమ్‌ సీఈవో కాశీ విశ్మనాథ్ బొకే ఇచ్చి అతడిని ఆహ్వానించారు. అనంతరం పసుపు వర్ణంతో ముస్తాబు చేసిన హోటల్ మొత్తం ధోనీ కలియతిరిగాడు.

ధోనీ హోటల్లో అడుగుపెట్టిన వీడియోను తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన చెన్నై ఫ్రాంచైజీ ‘ఫస్ట్‌ డే ఫస్ట్ షో చూసినప్పుడు ప్రతి ఒక్కరికి గూస్‌బంప్స్‌ వస్తాయని’ ట్యాగ్ లైన్‌ ఇచ్చింది. అలాగే, తాలా దర్శనం అని మరో ఫొటో పోస్ట్ చేసి.. విజిల్‌పోడు అని హాష్‌ట్యాగ్‌ ఇచ్చింది. ఇప్పుడు ఈ హాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్ అవుతోంది. కాగా, మంగళవారం నుంచి ధోనీ ప్రాక్టీస్‌ మొదలు పెడుతాడని టీమ్‌ సీఈవో తెలిపారు. అలాగే, జట్టు అధికారిక ట్రైనింగ్‌ క్యాంప్‌ ఈ నెల 19న ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ నెల 29న జరిగే సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబైతో చెన్నై తలపడనుంది.

More Telugu News