మొబైల్ వినియోగదారుల నెత్తిన మరో పిడుగు.. డేటా, కనెక్షన్ చార్జీలు పెంచాలంటూ ప్రభుత్వానికి వొడాఫోన్ లేఖ

Vodafone Idea writes letter to Union Governmet about Data charges
  • డేటా చార్జీలను ఏడెనిమిది రెట్లు పెంచాల్సిందే
  • అవుట్ గోయింగ్ కాల్స్‌పై ఉచితాన్ని ఎత్తివేయాలి
  • ఏప్రిల్ ఒకటి నుంచే అమలు కావాలి
టారిఫ్ చార్జీలు పెంచి మొబైల్ వినియోగదారుల నెత్తిన భారం వేసిన టెలికం కంపెనీలు ఇప్పుడు మరో పిడుగు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుత సంక్షోభం నుంచి బయపడాలంటే ఏప్రిల్ ఒకటి నుంచి డేటా, అవుట్ గోయింగ్ చార్జీలు నిర్ణయించక తప్పదని పేర్కొంటూ ప్రముఖ టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందులో ఏయే చార్జీలను ఏ మేరకు పెంచాలో కూడా పేర్కొంది.

ప్రస్తుతం ఒక జీబీ డేటా సగటున నాలుగైదు రూపాయలకు లభిస్తోంది. దీనిని ఏడెనిమిది రెట్లు పెంచి కనీసం రూ.35గా చేయాలని, అవుట్ గోయింగ్ కాల్స్‌పై ప్రస్తుతం ఉన్న ఉచితాన్ని ఎత్తివేసి నిమిషానికి ఆరు పైసలను కనీస చార్జీగా నిర్ణయించాలని కోరింది. అలాగే, కనీస కనెక్షన్ చార్జీని రూ. 50గా నిర్ణయించాలని అభ్యర్థించింది. ఇలా చేస్తే తప్ప కంపెనీల మనుగడ సాధ్యం కాదని ఆవేదన వ్యక్తం చేసింది.  

ప్రభుత్వం కనుక ఇందుకు అంగీకరిస్తే వినియోగదారుల జేబులు చిల్లులు పడడం ఖాయం. మరోవైపు ఇంచుమించు ఇలాంటి డిమాండ్లతోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్)కు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) లేఖ రాసింది. టెలికం పరిశ్రమను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ (డీసీసీ) నేడు సమావేశం కానుంది.
Go Back to Shorts
Telcos
Vodafone Idea
DoT
TRAI
COIA

More Telugu News