Mahesh Babu: నిజాయతీ లేని వ్యక్తులంటే నాకు నచ్చదు: మహేశ్ బాబు

  • జాతీయ మీడియా సంస్థకు మహేశ్ బాబు ఇంటర్వ్యూ
  • రాపిడ్ ఫైర్ రౌండ్ లో ఆసక్తికర సమాధానాలు
  • తనను తాను అణకువ గల వ్యక్తిగా పేర్కొన్న మహేశ్ బాబు
Mahesh Babu attends rapid fire round

'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ఘనవిజయం అందుకున్న నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో రాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మూడు మాటల్లో మీ గురించి ఎలా చెబుతారు? అని మీడియా ప్రతినిధి అడగ్గా, "హంబుల్, హంబుల్, హంబుల్" అంటూ తాను అణకువ గల వ్యక్తినని స్పష్టం చేశారు.

సినీ రంగంలో చిరస్మరణీయ ఘటన ఏదైనా ఉందా? అంటే, మురారి చిత్రం చూడగానే తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తన భుజంపై అభినందన పూర్వకంగా చేయి వేయడాన్ని మర్చిపోలేనని తెలిపారు. మీ దృష్టిలో మధురమైన రొమాంటిక్ క్షణాలు ఏవన్న ప్రశ్నకు మహేశ్ బదులిస్తూ, ఓ మాంచి సినిమాను తన భార్యతో కలిసి చూడడమే రొమాంటిక్ అని వెల్లడించారు.

మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, నిజాయతీ లేని వ్యక్తులంటే తనకు అస్సలు నచ్చదని స్పష్టం చేశారు. తనపై బయోపిక్ పై తీస్తే ఎవరు నటిస్తే బాగుంటుందన్న ప్రశ్నకు మహేశ్ తనదైన శైలిలో రిప్లయ్ ఇచ్చారు. తనది చాలా సాధారణమైన జీవితం అని, బయోపిక్ తీసేందుకు అవసరమైన సరంజామా లేని బోరింగ్ లైఫ్ అని చమత్కరించారు.

తన సినిమా కెరీర్ తొలినాళ్లలో రక్తంతో ఓ అభిమాని లేఖ రాయడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఇక, ఓ రోడ్ ట్రిప్ లో ముగ్గురితో ప్రయాణించాల్సి వస్తే తారక్, చరణ్ లను ఎంచుకుంటానని, సమతూకంగా ఉండేందుకు మూడో వ్యక్తిగా చిరంజీవి గారి పేరు చెబుతానని హాయిగా నవ్వేశారు.

More Telugu News