Shubman Gill: ప్ర‌పంచ‌క‌ప్‌​ టీమ్‌లో చోటు దక్కకపోతే ఆ పని చేస్తా.. శుభ్‌మ‌న్‌ గిల్‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  • తనకు వ‌ర‌ల్డ్‌క‌ప్‌ జట్టులో చోటు దక్కకపోతే, టీమ్‌కు మద్దతిస్తూ ప్లేయర్లను ప్రోత్సహిస్తానన్న గిల్‌
  • ఈ నెల 27న రోహిత్‌, అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలో భేటీ కానున్న సెలెక్ష‌న్ ప్యానెల్‌
  • అదే రోజు టీ20 ప్ర‌పంచ్‌క‌ప్ 2024 కోసం 15 మందితో కూడిన భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించే అవ‌కాశం
  • కోహ్లీ, గిల్‌, జైస్వాల్ విష‌యంలో అయోమ‌యంలో సెల‌క్ష‌న్ క‌మిటీ
Shubman Gill backs his name for India T20 World Cup 2024 squad

ఈ ఏడాది జూన్ లో జ‌ర‌గ‌బోయే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన బృందాన్ని ఎంపిక చేసేందుకు ఇప్ప‌టికే అన్ని ఏర్పాటు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. అతి త్వ‌ర‌లోనే బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్‌తో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ భేటీ కానున్నారు. అయితే, ఈ 15 మంది టీమిండియా స్క్వాడ్‌లో ఎవ‌రు ఉంటారు? చివ‌రి నిమిషంలో ఎవ‌రిని త‌ప్పిస్తారు? అనే విషయం ఇప్ప‌టికీ స‌స్పెన్స్ గానే ఉంది. ఈ క్రమంలో వ‌ర‌ల్డ్‌క‌ప్‌ జట్టు విషయంలో టీమ్ఇండియా యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్‌ గిల్‌ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు జట్టులో చోటు దక్కకపోతే, టీమ్‌కు మద్దతిస్తూ ప్లేయర్లను ప్రోత్సహిస్తానని అన్నాడు.

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ జట్టులో గిల్‌కు స్థానం ఉంటుందా? గిల్‌కు ఇతర యంగ్ ప్లేయర్ల నుంచి పోటీ ఎదురుకానుందా? అన్న చర్చలు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇలాంటివి విన్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అనే ప్ర‌శ్న గిల్‌కు ఎదురైంది. దానికి గిల్ ఆస‌క్తిక‌ర‌ సమాధానం ఇచ్చాడు. 'సెలక్షన్ మాటకొస్తే నేను గత సీజన్ ఐపీఎల్లో సుమారు 900 పరుగులు చేశాను. అయినప్పటికీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ జట్టులో చోటు దక్కకపోతే, టోర్నీకి ఎంపికైన ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తా. టీమిండియాకు మద్దతిస్తా' అని చెప్పుకొచ్చాడు. అలాగే గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్సీపై కూడా గిల్ స్పందించాడు. కెప్టెన్సీ అనుభ‌వం చాలా బాగుంద‌న్నాడు. తాను చాలా విష‌యాలు నేర్చుకున్న‌ట్లు తెలిపాడు.

కాగా, ఈ నెల 27న జ‌రిగే ముంబై ఇండియ‌న్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్ అనంత‌రం రోహిత్‌, అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలో సెల‌క్ష‌న్ ప్యానెల్ స‌మావేశం కానుంద‌ని స‌మాచారం. 'దైనిక్ భాస్క‌ర్' నివేదిక ప్ర‌కారం ఆ రోజు 15 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును ఖ‌రారు చేయ‌నుంది. ఇక ఈ టోర్నీలో పాల్గొనే ఆయా జ‌ట్ల స‌భ్యుల వివ‌రాలు తెలిపేందుకు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మే 1 ఆఖ‌రి గడువుగా పేర్కొంది. 

కోహ్లీ, గిల్‌, జైస్వాల్ విష‌యంలో డైలామాలో సెల‌క్ష‌న్ క‌మిటీ  
ఇదిలాఉంటే.. విరాట్ కోహ్లీ, శుభ్‌మ‌న్ గిల్‌, య‌శ‌స్వి జైస్వాల్ ఈ ముగ్గురు దాదాపు ఒకే ప్లేస్‌లో బ్యాటింగ్‌కు వ‌స్తుంటారు. దాంతో వీరిలో ఎవ‌రినీ ఎంపిక చేయాల‌నే అయోమ‌యంలో సెలెక్ష‌న్ ప్యానెల్ ఉన్న‌ట్లు బీసీసీఐ అధికారిక వ‌ర్గాల స‌మాచారం. ఈ ఐపీఎల్‌లో కోహ్లీ టాప్ ఫామ్‌లో దూసుకెళ్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే టోర్నీలోనే అత్య‌ధిక ప‌రుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. మ‌రోవైపు యంగ్ బ్యాట‌ర్ జైస్వాల్ కూడా ఇటీవ‌ల ముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లో భారీ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. అటు జీటీ సార‌ధి కూడా మంచి ప్ర‌ద‌ర్శ‌న‌తో ప‌ర్వాలేద‌నిపిస్తున్నాడు. దీంతో ఈ  ముగ్గురిలో ఎవ‌రిని వ‌ర‌ల్డ్‌క‌ప్ టీమ్‌కు ఎంపిక చేయాల‌నే డైలమాలో సెల‌క్ష‌న్ క‌మిటీ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News