Varla Ramaiah: సాక్షి దిన పత్రికను మీడియా ముందే తగులబెట్టిన వర్ల రామయ్య.. తీవ్ర ఆగ్రహం

  • ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని వాస్తవాలను ప్రచురించాలి 
  • ఆధారాలు లేకుండా రాతలు రాస్తున్నారు 
  • వైసీపీ నేతలు శునకానందం, రాక్షసానందం పొందుతున్నారు 
  • కేసుల గురించే వైసీపీ నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు 
valra ramaiah fires on ycp leaders

సాక్షి దిన పత్రికను టీడీపీ నేత వర్ల రామయ్య ఈ రోజు మీడియా సమావేశంలో తగులబెట్టారు. ఆ పత్రికలో రాస్తోన్న వార్తల పట్ల తనకు విరక్తి కలిగిందని చెప్పారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని వాస్తవాలను ప్రచురించాలి. ఈ పత్రిక తగులబెట్టడానికి వైసీపీ నేతల వాగుడే కారణం. ఆధారాలు లేకుండా రాతలు రాస్తున్నారు. పత్రికా రంగం చాలా ప్రాధాన్యమైనది. అయినప్పటికీ కూడా తగులబెడుతున్నామంటే ఎంతటి పనికిమాలిన రాతలు రాసుంటారు?' అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

'రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు. వైసీపీ నేతలు శునకానందం, రాక్షసానందం పొందుతున్నారు. చంద్రబాబుని వికారంగా చూపిస్తున్నారు. ఫ్యాక్షనిస్టుల మెంటాలటీతో ప్రవర్తిస్తున్నారు. మీ సాక్షి పత్రికను మంటల్లో తగుల బెట్టాను. కేసుల గురించే వైసీపీ నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు' అని వర్ల రామయ్య తెలిపారు.

'ప్రజలు అవకాశం ఇచ్చారు సరిగ్గా పరిపాలించండి. పారదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వం రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏముంది? రహస్యంగా ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? పైకి గంభీరంగా కనపడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ లోపల భయపడుతున్నారు' అని వర్ల రామయ్య అన్నారు.

More Telugu News