Corona Virus: వీఐపీలకు కరోనా సోకినట్టు అనుమానం... గాంధీ ఆసుపత్రిలో సకల సౌకర్యాలతో ప్రత్యేక వార్డు!

  • కరోనా అనుమానితులుగా వచ్చిన ఉన్నతాధికారి కుటుంబం
  • మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్
  • పేయింగ్ రూమ్ లను వీఐపీ కరోనా వార్డుగా మార్చిన అధికారులు
Special Ward setup for VIP sufferers of Corona virus

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా అనుమానితుల కోసం ఓ వీఐపీ ఐసోలేషన్ వార్డు సిద్ధమైంది. ఇక్కడ చేరే వారికి టీవీ, ఏసీ, ప్రత్యేక బాత్ రూమ్ తదితర సదుపాయాలను కల్పించనున్నారు. ఇక వీఐపీ అనుమానితుల సంఖ్య పెరిగితే, వీఐపీ వార్డులను కూడా పెంచుతామని అధికారులు అంటున్నారు.

వాస్తవానికి గాంధీ ఎమర్జెన్సీ విభాగంలోని ఎక్యూట్ మెడికల్ కేర్ లో 10, ప్రధాన భవంతిలో 20 పడకలతో కరోనా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. అయితే, ఇటీవల ఓ పోలీసు ఉన్నతాధికారి కుటుంబీకులతో పాటు చైనా నుంచి వచ్చిన ఎయిర్ హోస్టెస్ లు కరోనా అనుమానంతో గాంధీ ఆసుపత్రికి వచ్చారు.

తొలుత వీరిని కూడా సాధారణ వార్డులో చేర్చగానే, తమ హోదాకు తగ్గ వసతులు లేకపోవడంతో వీరంతా అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాము ఖర్చు చేసేందుకు వెనుకాడబోమని, తమకు మెరుగైన వసతులు కావాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో గాంధీలో ఉన్న పేయింగ్ రూమ్ లను కరోనా వీఐపీ వార్డులుగా ఏర్పాటు చేశారు. ఇక్కడ వారికి సమస్త సౌకర్యాలూ అందుతాయి.

More Telugu News