Amaravati: రాజధాని అంశంపై పార్లమెంట్ లో గట్టిగా పోరాడతాం: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

  • మందడంలో రైతులకు మద్దతు తెలిపిన గల్లా
  • పెయిడ్ ఆర్టిస్టులంటూ రైతులను కించపరిచే వారు సిగ్గుపడాలి
  • ‘అభివృద్ధి’ అంటే రాజధానిని విభజించడం కాదు

రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ఏపీ ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మద్దతు తెలిపారు. మందడంలో రైతులను కలిసి వారికి తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని అంశంపై పార్లమెంట్ లో గట్టిగా పోరాడతామని అన్నారు.

పెయిడ్ ఆర్టిస్టులంటూ రైతులు, మహిళలను కించపరిచే వారు సిగ్గుపడాలని, ‘అభివృద్ధి’ అంటే రాజధానిని విభజించడం కాదని అన్నారు. అలా విభజించుకుంటూ పోతే ఖర్చు పెరుగుతుంది తప్ప ఆదాయం రాదని, అమరావతిని మూడు ముక్కలు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయని విమర్శించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారని గల్లా జయదేవ్ కు మహిళలు ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేయడమే కాకుండా కేసులు కూడా బనాయించారని చెప్పారు.

More Telugu News