Veer Savarkar: కాంగ్రెస్ సేవాదళ్ విడుదల చేసిన పుస్తకంపై ఎన్సీపీ ఫైర్

  • కొత్త వివాదానికి తెర లేపిన కాంగ్రెస్ సేవాదళ్ పుస్తకం
  • సావర్కర్, గాడ్సేల మధ్య శారీరక సంబంధం ఉందని పేర్కొన్న వైనం
  • ఈ ఆరోపణలు దురదృష్టకరమన్న నవాబ్ మాలిక్
'వీర్ సావర్కర్.. కిత్నే వీర్?' పేరుతో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ విడుదల చేసిన పుస్తకం కొత్త వివాదానికి తెరతీసింది. హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్, మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేల మధ్య శారీరక సంబంధం ఉండేదని ఈ పుస్తకంలో ఉండటం వివాదాస్పదమైంది. ఇప్పటికే బీజేపీ నేతలు కాంగ్రెస్ పై మండిపడుతున్నారు. తాజాగా ఆ పార్టీని ఎన్సీపీ కూడా తప్పుపట్టింది.

ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మాట్లాడుతూ, ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని అన్నారు. వారిద్దరూ ఇప్పుడు మన మధ్య లేరని... అలాంటి వారిపై కించపరిచే వ్యాఖ్యలు చేయరాదని చెప్పారు. వెంటనే ఈ పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ పుస్తకంలో ఎన్నో వివాదాస్పద అంశాలు ఉన్నాయి. 12 ఏళ్ల వయసులోనే మైనార్టీ మహిళలపై అత్యాచారాలు చేసేలా తన అనుచరులను సావర్కర్ ప్రోత్సహించాడని పుస్తకంలో ఉంది. అంతేకాదు, మసీదులపై రాళ్లు రువ్వాలని కూడా ప్రోత్సహించారని పేర్కొంది. అండమాన్ జైలు నుంచి విడుదలైన తర్వాత బ్రిటిషర్ల నుంచి సావర్కర్ డబ్బు స్వీకరించారని కూడా ఉంది.
Veer Savarkar
Congress Seva Dal
NCP
Nathuram Godse

More Telugu News