Andhra Pradesh: ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్

  • ఇళ్ల నిర్మాణంపై అట్టుడికిన అసెంబ్లీ
  • ప్రభుత్వ సమాధానాలు సరిగా లేవంటూ టీడీపీ వాకౌట్
  • టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్న బొత్స

ఏపీ అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ వాకౌట్ చేసింది. పేద ప్రజల ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం ఇస్తున్న సమాధానాలు సరిగా లేవంటూ అసంతృప్తిని వ్యక్తం చేసిన టీడీపీ... సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించింది. అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి వెళ్లిపోయారు. అంతకు ముందు ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వ వైఖరిపై టీడీపీ విమర్శలు గుప్పించింది. 85 శాతం పూర్తయిన నిర్మాణాలను కూడా ఆపేశారని మండిపడింది. హైదరాబాదుకు చెందిన చిన్న కంపెనీలకు పనులను అప్పజెబుతున్నారని ఆరోపించింది.

దీనికి సమాధానంగా, సభలో టీడీపీ అన్నీ అబద్ధాలే చెబుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జాబితా నుంచి అర్హులైన లబ్ధిదారులను తొలగించామంటూ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని... అందుకే రివర్స్ టెండరింగ్ కు వెళ్లామని తెలిపారు. రివర్స్ టెండరింగ్ లో రూ. 150 కోట్లు మిగిలిందని చెప్పారు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రతి ఇంటికి రూ. 75 వేలు ఆదా అయిందని అన్నారు.

More Telugu News