'రాహుల్ గాంధీని శిక్షించాల్సిందే' అంటూ లోక్ సభలో కన్నీరు పెట్టుకున్న స్మృతీ ఇరానీ!
- మేకిన్ ఇండియాను రేపిన్ ఇండియాతో పోల్చిన రాహుల్
- బీజేపీ నేతల నుంచి బాలికలను ఎవరు కాపాడతారని ప్రశ్న
- లోక్ సభలో రాహుల్ వ్యాఖ్యలపై దుమారం
నిన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నేడు సభలో పెను దుమారాన్ని రేపాయి. జార్ఖండ్ లో జరిగిన ఓ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "మోదీ ఏమో బేటీ బచావో, బేటీ పటావో అంటారు. మరి బాలికలను కాపాడేదెవరు? బాలికలను బీజేపీ ఎమ్మెల్యేల నుంచి కాపాడాలి. మేకిన్ ఇండియాను రేప్ ఇన్ ఇండియాగా మార్చేశారు" అని నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.
నేటి ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే, రాహుల్ వ్యాఖ్యల ప్రస్తావన వచ్చింది. బీజేపీ మహిళా ఎంపీలు రాహుల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, అందుకు ప్రతిగా కాంగ్రెస్ తదితర విపక్షాలు నినాదాలు ప్రారంభించడంతో సభలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయన సభలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆపై సభ ఎంత సేపటికీ అదుపులోకి రాకపోవడంతో మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.