Hyderabad: హైదరాబాద్ సెక్రటేరియేట్ పరిధిలో ఆంక్షలు!

  • సైఫాబాద్ పీఎస్ పరిధిలో ఆంక్షలు
  • పబ్లిక్ సమావేశాలు నిషిద్ధం
  • ముందస్తు అనుమతి తప్పనిసరన్న అధికారులు

తెలంగాణ సెక్రటేరియేట్ కు చుట్టుపక్కల 3 కిలోమీటర్ల పరిధిలో పలు ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ ప్రకటించారు. సైఫాబాద్‌ పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ ప్రాంతంలో పబ్లిక్‌ సమావేశాలు నిషిద్ధమని, ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడి ఉండటం నేరమని అన్నారు.

సచివాలయం చుట్టుపక్కల ఎవరూ ఆయుధాలు, బ్యానర్లు, ప్లకార్డులు, కర్రలు, లాఠీలు, కత్తులు తదితర ప్రమాదకర వస్తువులను కలిగివుండరాదని తెలిపారు. ప్రసంగాలు, నినాదాలు చేయరాదని, ర్యాలీలు, యాత్రలపైనా నిషేధం ఉంటుందని అన్నారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమం నిర్వహించుకోవాలని భావిస్తే, ముందుగానే దరఖాస్తు చేసుకుని, రాత పూర్వక హామీ ఇవ్వాలని, ఆపై అనుమతి మంజూరైతేనే కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఈ ఆంక్షలు ఫిబ్రవరి 2 వరకూ అమల్లో ఉంటాయని తెలిపారు.

More Telugu News