గురువుగారి విగ్రహాన్ని ఆవిష్కరించిన కమలహాసన్, రజనీకాంత్!
- ప్రొడక్షన్ సంస్థ కోసం కొత్త ఆఫీసు నిర్మించుకున్న కమల్
- ప్రారంభోత్సవానికి ప్రముఖులకు ఆహ్వానం
- విచ్చేసిన రజనీకాంత్
- రజనీతో కలిసి దర్శకుడు బాలచందర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్
కమల్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ సంస్థ కోసం చెన్నైలో కొత్త కార్యాలయం నిర్మించుకున్నారు. ఆ కార్యాలయ ప్రారంభోత్సవానికి రజనీకాంత్ సహా అనేకమంది చిత్రప్రముఖులను ఆహ్వానించారు. ఆ కార్యాలయంలోనే బాలచందర్ విగ్రహం ఏర్పాటు చేయించిన కమల్, ఆ విగ్రహాన్ని రజనీకాంత్ తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రజనీకాంత్, కమలహాసన్ ఒకరిపై ఒకరు అభినందనల జల్లు కురిపించుకున్నారు. కమల్ రాజకీయాల్లో ప్రవేశించినా సినిమా రంగాన్ని మాత్రం మర్చిపోలేదని, కళను ఎల్లప్పుడూ అనుసరిస్తూనే ఉన్నారని రజనీ కొనియాడారు. కమల్ మాట్లాడుతూ, రజనీ, తాను ఒకరినొకరు గౌరవించుకుంటామని, విమర్శించుకుంటామని, ఒకరి పనిని మరొకరం ఇష్టపడుతూనే ఉంటామని వివరించారు. ఇరువురి భవిష్యత్ శుభప్రదంగానే ఉంటుందని తమకు గట్టి నమ్మకం అని తెలిపారు.