Uttar Pradesh: యూపీలో కాలేజీ, యూనివర్సిటీల్లో మొబైల్స్ వాడకంపై నిషేధం

  • విద్యార్థులతోపాటు, అధ్యాపకులకూ నిబంధన వర్తింపు
  • క్యాంపస్ లోకి మొబైల్స్ తీసుకు రావద్దు
  • యూపీ డైరెక్టరేట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ అదేశం

మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ విద్యార్థులు కాలేజీ సమయాన్ని వృథా చేసుకుంటున్నారని ఉత్తర ప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ కటువైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీలు, విశ్వవిద్యాలయాల పరిధుల్లో మొబైల్స్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిషేధం అధ్యాపకులకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. విద్యార్థులు విద్యనభ్యసించడానికి సరైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది.

ఈ  ఉత్తర్వుల ప్రకారం విద్యార్థులు, అధ్యాపకులు క్యాంపస్ లోకి మొబైల్స్ తీసుకు రావటం, ఉపయోగించడం కూడదు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా మితిమీరిన మొబైల్స్ వాడకంపై ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి వర్గ సమావేశాల్లో కూడా కొందరు సభ్యులు తమ మొబైల్స్ చూస్తూ సందేశాలు చదువుతూ ఎజెండా విషయాలను పక్కన పెడుతున్నారని  సమావేశాల్లో మొబైల్స్ వాడొద్దని ఆదేశాలిచ్చారు. ఒకవేళ మొబైల్స్ తీసుకు వచ్చినప్పటికి వాటిని స్విచ్ ఆఫ్ చేయాలని సూచించారు. 

More Telugu News