Godavari: మళ్లీ పోటెత్తిన గోదావరి...జల దిగ్బంధంలో తొమ్మిది గ్రామాలు
గోదావరి నదిలో వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. ఎగువన నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో గంట గంటకూ నదిలో నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటికే పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్వేపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించే తొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఇంకా పెరుగుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి వరద పెరిగినప్పుడల్లా తరచూ తమకీ సమస్య తప్పడం లేదని, వరదలో చిక్కుకున్నన్నాళ్లు ఇబ్బందులేనని గ్రామస్థులు వాపోతున్నారు.