LVB: చిక్కుల్లో లక్ష్మీ విలాస్ బ్యాంకు.. భారీ కుట్ర జరిగిందంటూ రెలిగేర్ ఫిర్యాదు

  • తాము చేసిన రూ.790 కోట్ల డిపాజిట్ దుర్వినియోగమైందని ఆరోపణ
  • కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
  • డైరెక్టర్లపై మోసం, నమ్మక ద్రోహం, నేరపూరిత కుట్ర ఆరోపణలు

ప్రైవేటు రంగానికి చెందిన లక్ష్మీ విలాస్ బ్యాంకు (ఎల్‌వీబీ)పై ఎఫ్ఐఆర్ నమోదైంది. తాము చేసిన రూ.790 కోట్ల డిపాజిట్‌ను బ్యాంకు దుర్వినియోగం చేసిందంటూ రెలిగేర్ ఫిన్‌వెస్ట్ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీలోని కన్నాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంకు బోర్డు డైరెక్టర్లపై మోసం, నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం అభియోగాలు నమోదయ్యాయి. బ్యాంకుపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయమై బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బీఎస్‌ఈ)కి సమాచారం అందింది.

తాము చేసిన డిపాజిట్ దుర్వినియోగం వెనక భారీ కుట్ర ఉన్నట్టు అనిపిస్తోందని రెలిగేర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఎల్‌వీబీ కేంద్రంగా ఇది నడిచినట్టు ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలు మొత్తం బ్యాంకు బోర్డుపైనా, లేక కొందరు డైరెక్టర్లపైనేనా అన్నది తెలియరాలేదు. ఎల్‌వీబీపై ఫిర్యాదుతో ఆ బ్యాంకు షేర్లు ఒక్కసారిగా పతనం చెందాయి. ఎన్ఎస్‌ఈలో షేరు విలువ రూ.36.50 వద్ద, బీఎస్‌ఈలో రూ.36.55 వద్ద ముగిసింది.

More Telugu News