Telangana: రెండు నెలలకు రూ.6 లక్షల విద్యుత్ బిల్లు.. గుండెలు బాదుకున్న గోదావరిఖని వాసి

  • విద్యుత్ మీటరులో లోపాన్ని గుర్తించినా సరిచేయని అధికారులు
  • బిల్లు చూసి డంగైన రాజయ్య
  • లోపం ఉంటే సరిచేస్తామన్న అధికారులు
రెండు నెలలకు గాను తనకొచ్చిన విద్యుత్ బిల్లును చూసిన ఓ వ్యక్తి గుండె బద్దలైనంత పనైంది. బిల్లు పట్టుకుని విద్యుత్ శాఖ అధికారుల వద్దకు వెళ్లి చూపిస్తే వారు కూడా విస్తుపోయారు. ఓ చిన్న ఇంటికి ఏకంగా రూ. 6 లక్షలకు పైగా వచ్చిన బిల్లును చూసిన అధికారులు కూడా షాకయ్యారు. తెలంగాణలోని పెదపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిందీ ఘటన.

సంజయ్ నగర్‌కు చెందిన మాస రాజయ్య ఇంటికి అమర్చిన విద్యుత్ మీటరులో సాంకేతిక సమస్య తలెత్తింది. అధికారులు ఆగస్టులో సమస్యను గుర్తించినప్పటికీ దానిని మరమ్మతు మాత్రం చేయలేదు. ఈ నెలలో అలాగే దాని నుంచి రీడింగ్ నమోదు చేసి 6,07,414 రూపాయల బిల్లను రాజయ్య చేతిలో పెట్టారు. బిల్లు చూసిన రాజయ్య గుండె గుభేల్‌మంది. వెంటనే దానిని తీసుకెళ్లి అధికారులకు చూపించాడు. కాగా, విద్యుత్ మీటరులో లోపం ఉన్నట్టు రాజయ్య నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, సమస్య ఉంటే సరిచేస్తామని అధికారులు తెలిపారు.
Telangana
current meter
current bill
Peddapalli District

More Telugu News