దేశం అధ్యక్ష పాలన దిశగా పయనిస్తోంది: మమతా బెనర్జీ
- కశ్మీర్ గురించి మాట్లాడేవారిని అణచి వేస్తున్నారు
- ముఖ్యమైన సంస్థల్లో అనుకూల వ్యక్తులను నియమించుకుంటున్నారు
- నన్ను అరెస్ట్ చేసినా భయపడను
కశ్మీర్ అంశంలో అసమ్మతి తెలుపుతున్న గొంతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. కశ్మీర్లోని వాస్తవ పరిస్థితి గురించి మాట్లాడేవారిని అణచివేస్తోందని అన్నారు. ముఖ్యమైన ప్రభుత్వ సంస్థలకు కూడా తమకు అనుకూలంగా ఉన్న రిటైర్డ్ వ్యక్తులను నియమించుకుంటున్నారని... వారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నారని చెప్పారు. భారతదేశం అధ్యక్ష పాలనవైపుగా పయనిస్తోందని అన్నారు. ఒకవేళ అదే జరిగితే దేశంలో ప్రజాస్వామ్యానికి చోటుండదని చెప్పారు. ప్రతిపక్ష నేతలను బెదిరించడం, లేకపోతే డబ్బుతో కొనుగోలు చేయడం వంటివి చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తనను అరెస్ట్ చేసినా భయపడబోనని... బీజేపీ ముందు తల వంచబోనని తెలిపారు.