Pawan Kalyan: రాపాక విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే ఇక నేనే రంగంలోకి దిగుతా: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
మలికిపురం పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన వ్యవహారంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజల తరఫున పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రాపాకపై కేసులు పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజలు కోరిన మీదటే వారికి మద్దతుగా రాపాక స్టేషన్ కు వెళ్లారని, అంతమాత్రానికే కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు.

నెల్లూరులో ఓ జర్నలిస్టుపై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పుడు మలికిపురం ఘటనలో గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చారని విమర్శించారు.

ఈ ఘటన శాంతిభద్రతల సమస్యగా మారకుండా అధికారులు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన కార్యకర్తలు, నేతలు సంయమనంతో వ్యవహరించాలని పవన్ సూచించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం తాను రంగంలోకి దిగుతానని జనసేనాని స్పష్టం చేశారు. మలికిపురం ఘటనపై ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సమీక్షిస్తున్నానని తెలిపారు. 
Go Back to Shorts
Pawan Kalyan
Rapaka
Jana Sena

More Telugu News