తెలంగాణలో 16 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్!

  • రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్న 330 ప్రైవేటు ఆసుపత్రులు
  • ఏడాదిన్నరగా రూ.1500 కోట్ల బకాయిలు
  • బకాయిలు రూ.800 కోట్లేనంటున్న ప్రభుత్వం
ఈ నెల 16 నుంచి తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.1500 కోట్లు బకాయి పడింది. గత ఏడాదిన్నరగా ఈ సొమ్ము చెల్లించకపోవడంతో  ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. తమకు రావాల్సింది రూ.1500 కోట్లని అసోసియేషన్ చెబుతుండగా కాదు, రూ.800 కోట్లేనని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

ఆరోగ్య శ్రీ కింద రాష్ట్రవ్యాప్తంగా 330 ఆసుపత్రులు సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికే ప్రభుత్వం ఏకంగా రూ.70 కోట్లు చెల్లించాల్సి ఉందని సమాచారం. బకాయిలు చెల్లిస్తామంటూ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో అసోసియేషన్ పేర్కొంది. బకాయిల విడుదల విషయమై నేడు ఆరోగ్యశాఖ మంత్రి ఈటలతో పాటు ఆరోగ్యశ్రీ సీఈవోను కలవనున్నట్టు అసోసియేషన్ ముఖ్యులు తెలిపారు.
Go Back to Shorts
Arogya sri
Telangana
private hospitals

More Telugu News