Train Accident: హత విధీ...దొంగను పట్టుకోబోయి రైలు కిందపడి తల్లీకూతుర్లు దుర్మరణం

షార్ట్స్‌లో చూడండి
తమ బ్యాగు కనిపించక పోవడంతో ఎత్తుకు పోతున్న దొంగవెంట పడిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు రైలు కిందపడి దుర్మరణం పాలైన ఘటన ఇది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మధురలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలావున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన తల్లీకూతుళ్లు మీనాదేవి (45), మనీషా (21) హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైలులో ఢిల్లీ నుంచి రాజస్థాన్‌కు ప్రయాణిస్తున్నారు. ఈరోజు తెల్లవారు జామున రైలు వింద్రావన్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకునే సరికి హఠాత్తుగా ఎవరో చైన్‌లాగి రైలును ఆపినట్టు అనిపించడంతో ఉలిక్కిపడిన తల్లీకూతుళ్లు లేచారు. చూస్తే తమ బ్యాగు కనిపించలేదు. ఓ వ్యక్తి వాటిని ఎత్తుకు పోతున్నట్లు గుర్తించి అతని వెంట పడ్డారు.

ఈ సందర్భంలో పట్టుతప్పి పట్టాలపై పడడంతో రైలు ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డారు. మీనాదేవి అక్కడికక్కడే మృతి చెందగా, మనీషా ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయింది. ఈ ఘటనపై ఆగ్రా రీజియన్‌ రైల్వే ఎస్పీ జోగిందర్‌కుమార్‌ మాట్లాడుతూ పరుగెత్తి వెళ్తున్న వీరు తివేండ్రం ఎక్స్‌ప్రెస్‌ కిందపడి మరణించరా, అదే సమయంలో మరో ట్రాక్‌పై వెళ్తున్న సంపర్క్‌ ఎక్స్‌ప్రెస్‌ కింద పడి మరణించారా అన్నది తెలియరాలేదన్నారు.

మీనాదేవి కుమారుడు ఆకాష్‌ (19) కూడా వీరితోపాటు ప్రయాణిస్తున్నాడని, ఘటన జరిగిన అనంతరం ప్రయాణికులు లేపితేగాని అతనికి విషయం తెలియదని చెప్పారు. ఆకాష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Train Accident
mother and daughter died
agra
Uttar Pradesh
nijamuddin train

More Telugu News