పోలవరానికి పోటెత్తుతున్న వరద.. 19 గ్రామాలకు రాకపోకలు బంద్
- గోదావరి నదికి చేరుతున్న భారీ వరద
- కొత్తూరు కాజ్ వే పైకి ఆరు అడుగుల మేర వరద నీరు
- ఆందోళన వ్యక్తం చేస్తున్న నిర్వాసిత గ్రామాల ప్రజలు
తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి భారీగా వరద నీరు వస్తోంది. ఈ నేపథ్యంలో, ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ఇప్పటికే కొత్తూరు కాజ్ వే పైకి ఆరు అడుగుల మేర వరద నీరు చేరుకుంది. ప్రాజెక్టు వద్ద ప్రమాదకర స్థాయిలో వరద నీరు చేరుకుంటుండటంతో... ఎగువ కాఫర్ డ్యాం, లోయర్ కాఫర్ డ్యాంల రక్షణ కోసం అధికారులు బౌల్డర్ వాల్స్ వేశారు. మరోవైపు పోలవరంకు ఎగువన ఉన్న 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద పెరిగితే తమ గ్రామాల్లోకి వరద నీరు చేరుకుంటుందని నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.