Andhra Pradesh: తుగ్లక్ పాలన అంటే టక్కున గుర్తుకువచ్చేది చంద్రబాబు పరిపాలనే!: వైసీపీ నేత జోగి రమేశ్

  • రాజధాని పేరుతో అంతర్జాతీయ కుంభకోణం చేశారు
  • భారీస్థాయిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు
  • బాబువల్లే ప్రపంచబ్యాంక్ లోన్ వెనక్కి వెళ్లిపోయింది
  • విజయవాడలో మీడియాతో వైసీపీ ఎమ్మెల్యే

రాజధాని పేరుతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అంతర్జాతీయ కుంభకోణానికి తెరలేపారని వైసీపీ నేత, ఎమ్మెల్యే జోగి రమేశ్ ఆరోపించారు. రాజధాని ప్రాంతంలోని రైతులకు ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు అమరావతిని ఓ భ్రమరావతిగా చూపించారని ఎద్దేవా చేశారు. విజయవాడలో ఈరోజు జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. రాజధాని కోసం చంద్రబాబుతో రైతులు కలిసి రాలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతీ విషయంలో ఆయన నిబంధనలు ఉల్లంఘించారనీ, ఐదేళ్లలో ప్రచారం తప్ప చేసిన పనులేవీ లేవని దుయ్యబట్టారు.

టీడీపీ అధినేత తీరువల్లే ప్రపంచబ్యాంక్ రుణం వెనక్కి వెళ్లిపోయిందని ఆయన విమర్శించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ఏపీలో తీవ్రమైన ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’కు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. తుగ్లక్ పాలన అనగానే టక్కున చంద్రబాబు పరిపాలనే గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, లోకేశ్ ఇళ్లు ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు.

More Telugu News