Andhra Pradesh: విజయసాయిరెడ్డి గారూ.. మీకు చత్వారంతో పాటు అల్జీమర్స్ వచ్చిందేమో.. చెక్ చేయించుకోండి!: బుద్ధా వెంకన్న చురకలు

  • టీడీపీ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదంటున్నారు
  • మీ మంత్రి నిన్న పట్టిసీమ నుంచే నీటిని విడుదల చేశారు
  • గజనీలో హీరోలా ఎక్కడయినా రాసిపెట్టుకోండి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రంగా విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తిచేయలేదని విజయసాయిరెడ్డి చెప్పడంపై వ్యంగ్యంగా స్పందించారు. విజయసాయిరెడ్డికి వయసు పెరగడంతో చత్వారం వచ్చిందేమో అని ఎద్దేవా చేశారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ డెల్టాకు నీటిని విడుదల చేశారంటే అది పట్టిసీమ ప్రాజెక్టు వల్లేనని స్పష్టం చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో బుద్ధా వెంకన్న స్పందిస్తూ..‘విజయసాయిరెడ్డి గారు! తెదేపా ప్రభుత్వం కట్టిన ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా మీకు కనపడలేదంటే వయసు పెరిగి చత్వారం వచ్చిందేమో! నిన్న ప్రకాశం బ్యారేజీ దగ్గర మీ జలవనరులశాఖ మంత్రి డెల్టాకు నీటిని విడుదల చేశారంటే ... అది పట్టిసీమ వల్ల కాదా?‘ అని ట్వీట్ చేశారు.

అలాగే మరో ట్వీట్ లో ‘పట్టిసీమ మీకు సాగునీటి ప్రాజెక్టులా అనిపించట్లేదా? ఆ పట్టిసీమను కట్టిందెవరు? నిన్న జరిగింది ఈరోజు గుర్తులేకుండా పోయిందంటే మీకు చత్వారంతో పాటు అల్జీమర్స్ వ్యాధి కూడా వచ్చిందేమో చెక్ చేసుకోవాలి. గజినీ సినిమా హీరోలాగా టీడీపీ కట్టిన ప్రాజెక్టుల పేర్లు ఎక్కడన్నా రాసిపెట్టుకోండి’ అని బుద్ధా వెంకన్న చురకలు అంటించారు.

More Telugu News