Karnataka: భర్తను ఒక్క చెంపదెబ్బతో చంపేసిన గృహిణి!

  • కర్ణాటకలో ఘటన
  • మద్యానికి బానిసైన భర్త
  • రోజూ తాగొస్తుండడంతో విసిగిపోయిన భార్య
మద్యపానం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. భర్త తాగి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య అతడిని చెంపమీద బలంగా కొట్టింది. ఆ దెబ్బకు అతడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. కర్ణాటకలోని చామరాజనగర ప్రాంతంలోని ఉత్తువళ్లిలో ఈ ఘటన జరిగింది. ఉత్తువళ్లికి చెందిన ప్రభుస్వామి మద్యానికి బానిసయ్యాడు. మద్యంలేకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాడు. ప్రభుస్వామి తీరుతో భార్య అంబిక విసిగిపోయింది.

ఎప్పట్లాగానే తాగి రావడంతో ఇద్దరి మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఆవేశంలో మాటామాటా పెరిగి అంబిక తన భర్త చెంపపై గట్టిగా కొట్టింది. ఆ దెబ్బ బలంగా తగలడంతో ప్రభుస్వామి కళ్లు తేలేశాడు. కాసేపటికే అతడి ప్రాణం పోయింది. అయితే, తాను కొట్టడంతోనే భర్త చనిపోయాడంటే తనను బతకనివ్వరని భావించిన అంబిక భర్త మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. ఉరివేసుకుని చనిపోయినట్టు అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ప్రభుస్వామి సోదరుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపడంతో అసలు నిజం బయటికి వచ్చింది.
Karnataka
Wife
Husband

More Telugu News