Vijayawada: లోక్‌సభలో పార్టీ విప్‌ పదవిని తిరస్కరించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని

  • నాకా అర్హత లేదనుకుంటున్నాను
  • నాపై నమ్మకం ఉంచినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు
  • వేరొకరికి బాధ్యత అప్పగించాలని కోరుతున్నా

లోక్‌సభలో టీడీపీ పార్టీ ఉపనేతగా, పార్టీ విప్‌గా నియమితుడైన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పదవి తనకొద్దంటూ తిరస్కరించారు. సార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర నుంచి టీడీపీ తరపున ముగ్గురు ఎంపీలు గెలుపొందగా అందులో నాని ఒకరు. ఆయనకు ఉపనేత, విప్‌ పదవి కట్టబెడుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

‘పార్టీ అధినేత చంద్రబాబు నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. అయితే ఆ పదవి చేపట్టేంత అర్హత నాకు లేదని  భావిస్తున్నా. అందుకే ఆయన ఆదేశాలు తిరస్కరిస్తూ మరో సమర్థుడిని ఆ పదవిలో నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని నాని తన మనసులో మాట చెప్పారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

కాగా అసలు విషయం వేరే ఉందన్న గుసగుసలు పార్టీవర్గాల్లో వినిపిస్తున్నాయి. తొలుత నిర్వహించిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో చంద్రబాబు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను పార్లమెంటరీ పార్టీ నేతగా, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడును లోక్‌సభాపక్ష నేతగా నియమించారు. దీంతో తనకు పార్టీలో ప్రాధాన్యం కల్పించటం లేదని నాని మనస్తాపానికి గురైనట్టు సమాచారం. ఈ అసంతృప్తితోనే విజయవాడలో చంద్రబాబు నిర్వహించిన ఇఫ్తార్‌ విందుకు కూడా ఆయన హాజరు జరుకాలేదు. తాజా నిర్ణయంతో ఆయన ఇంకా అలకవీడలేదని అర్ధమవుతోంది.

More Telugu News