Jagan: కేసీఆర్ ను కలసి స్వయంగా ఆహ్వానించనున్న జగన్

  • నేటి సాయంకాలం ఫోన్ లో కేసీఆర్ తో మాట్లాడిన జగన్ 
  • వైసీఎల్పీ సమావేశం తర్వాత జగన్ హైదరాబాద్ పయనం
  • ఈ నెల 30న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం

ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవ్యోత్సాహంతో ముందుకు వెళుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించి 151 సీట్లను సాధించిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 30న జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. తన ప్రమాణస్వీకారం గురించి జగన్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫోన్ లో వివరించారు.

విజయవాడలో జరిగే తన ప్రమాణస్వీకారోత్సవానికి రావాల్సిందిగా జగన్ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ఎన్నికల ఫలితాల తీరుతెన్నులపైనా ఇరువురు ఫోన్ లో చర్చించుకున్నట్టు తెలుస్తోంది. కాగా, రేపు తాడేపల్లిలో వైసీఎల్పీ సమావేశం ముగిశాక జగన్ హైదరాబాద్ వెళతారు. ఆపై కేసీఆర్ ను నేరుగా కలిసి ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కోరనున్నారు.

More Telugu News