Andhra Pradesh: టీడీపీ గెలుపు గుర్రాలతో వైసీపీ టచ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది!: చంద్రబాబు సంచలన ఆరోపణ

  • వైసీపీ నేతలు మా అభ్యర్థులతో మాట్లాడుతున్నారు
  • కర్ణాటక తరహాలో ఇక్కడ వైసీపీ కుట్రలను బయటపెట్టండి
  • టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తారన్న టీడీపీ నేతలతో వైసీపీ నేతలు టచ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలంతా పొలిటికల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి పెట్టాలని సూచించారు. ఇలాంటి కుట్రలను ఆధారాలతో బయటపెట్టాలని వ్యాఖ్యానించారు. అమరావతిలో టీడీపీ నేతలు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ మేరకు స్పందించారు.

కర్ణాటకలో బీజేపీ బండారాన్ని ఏవిధంగా బయటపెట్టారో, అదే విధంగా ఏపీలో వైసీపీ కుట్రలను బహిర్గతం చేయాలని సూచించారు. ‘నేరస్తులు ఎన్నటికీ విజయం సాధించలేరు. టీడీపీనే ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇప్పుడు టీఆర్ఎస్ వాయిస్ మారింది.

బీజేపీ కూడా బలహీనపడింది. కౌంటింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నేతలు డైలమాలో పడిపోతున్నారు. టీడీపీ నేతలంతా కౌంటింగ్ రోజున మరింత అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. చాలా నివేదికలను విశ్లేషించిన తర్వాతే టీడీపీ గెలుస్తుందని తాను చెబుతున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

More Telugu News