ఏనాడన్నా పోలింగ్ రోజున ఉదయం అంతమందిని చూశామా? జగన్ కోసం అంత వేవ్ ఉంటుందా?: చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించారు. పోలింగ్ ముగిసిన తర్వాత నిన్న అర్ధరాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన నేటి మధ్యాహ్నం మరోసారి పూర్తి స్థాయి సమీక్ష అనంతరం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

ఏనాడన్నా పోలింగ్ సందర్భంగా ఉదయమే అంతమంది జనం రావడం ఎప్పుడైనా చూశామా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వచ్చిన వాళ్లలో ఉన్న ఉత్సాహం కాసేపటికే చల్లారిపోయిందని, పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు. దాంతో వెనక్కివెళ్లిపోయి మళ్లీ వచ్చినా అదే పరిస్థితి ఎదురైందని తెలిపారు. ఇలా మూడుసార్లు జరిగిందని ఆరోపించారు.  ఉదయం భారీగా జనాలు తరలిరావడం చూస్తుంటే రాష్ట్రంలో మొత్తానికి ఏదో వేవ్ కనిపించిందని, జగన్ ను గెలిపించడానికి అంత వేవ్ ఉంటుందంటే తాను నమ్మనని అన్నారు.

అసలు, ఈవీఎం మొరాయించడంతో సీఈవోనే ఓటేయలేకపోయాడని, సాధారణ ఓటర్లు ఇంకేం వేస్తారని విమర్శించారు. "ఈవీఎంలను రిపేర్ చేయడానికి ఎవరెవరో వచ్చారు. వాళ్లు ఈవీఎంలు బాగుచేయడానికి వచ్చారా, లేక కుట్రపూరితంగా వాటిలో ఏదైనా మార్పులు చేయడానికి వచ్చారా? ఈ రిపేర్ చేసేవాళ్లను ఎవరు అపాయింట్ చేశారు? ప్రజల భవిష్యత్తును ఓ యంత్రం చేతిలో పెడతారా?" అంటూ ప్రశ్నించారు.   
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
Telugudesam

More Telugu News