MS Dhoni: మిస్టర్ కూల్ కు ఆగ్రహం వచ్చింది... జరిమానా పడింది!

  • పెవిలియన్ నుంచి మైదానంలోకి వచ్చి గొడవచేసిన ధోనీ
  • నో బాల్ ప్రకటించి, వెనక్కు తీసుకున్న అంపైర్లు
  • మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించిన ఐపీఎల్

మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకుని, ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ధోనీకి కోపం వచ్చింది. తన సహజ స్వభావానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాడు. అవుట్ అయి మైదానం బయటకు వెళ్లిన తరువాత, తిరిగి మైదానంలోకి వచ్చి గొడవ పడ్డాడు. దీన్ని ఐపీఎల్ నిబంధనల ప్రకారం 2వ స్థాయి నేరంగా పరిగణిస్తూ, మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాను విధించారు నిర్వాహకులు. "చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై 50 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించాం. ఆయన వివో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించారు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆయన లెవల్ 2 నేరం చేశారు" అని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.

అంతకుముందు చివరి ఓవర్ ను స్టోక్స్ వేస్తూ, శాంటనర్ కు ఫుల్ టాస్ బాల్ వేశాడు. ఈ బాల్ గాల్లోకి లేచి, ఆరు పరుగులు తెచ్చింది. ఇదే బాల్ ను తొలుత నోబాల్ గా ప్రకటించిన అంపైర్లు, దాన్ని వెనక్కు తీసుకోవడమే ధోనీ ఆగ్రహానికి కారణమైంది. ఫీల్డ్ అంపైర్ ఉల్లాస్ ఘాండే దీన్ని నోబల్ అని పేర్కొనగా, స్క్వేర్ లెగ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్ దాన్ని నోబాల్ కాదని తేల్చారు. దీంతో అప్పటికే పెవిలియన్ చేరిన ధోనీ, తిరిగి మైదానంలోకి వచ్చి గొడవకు దిగాడు.

More Telugu News