చావంటే భయం లేని నన్ను ఎవరూ ఏమీ చేయలేరు: సినీ నటుడు శివాజీ

  • మోదీ, కేసీఆర్, జగన్ టార్గెట్ గా విమర్శలు
  • జగన్, కేసీఆర్ లతో హోదా వస్తుందంటే నమ్మే పరిస్థితి లేదు
  • జగన్ కు సీఎం అయ్యే అర్హత లేదన్న శివాజీ
తనకు చావంటే భయం లేదని, తనన ఎవరూ ఏమీ చేయలేరని సినీ నటుడు శివాజీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్ లను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఆంధ్రాపై కేసీఆర్ కక్ష కట్టారని ఆరోపించిన శివాజీ, కేసీఆర్ డబ్బులు ముఖ్యమని భావిస్తే, అమరావతి, పోలవరం ప్రాజెక్టులను ప్రజలు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జగన్, కేసీఆర్ కలిసి హోదాను సాధిస్తామంటే నమ్మే పరిస్థితి లేదని అన్నారు.

పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి డబ్బులను నీళ్లలా ఖర్చు చేస్తున్న జగన్ కు సీఎం అయ్యే అర్హత లేదని నిప్పులు చెరిగారు. జగన్ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలోని మహిళలకు భద్రత ఉండదని వ్యాఖ్యానించిన శివాజీ, కేసీఆర్, జగన్ కలిస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా? అని ప్రశ్నించారు.  దేశంలోని ప్రాంతీయ పార్టీలను కలుపుకునేందుకు మోదీ కుట్రలు చేస్తున్నారని అన్నారు. మోదీ ప్రధానిగా ఉండగా, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి ఎందరో ఆర్థిక నేరగాళ్లు బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయారని ఆరోపించారు. ఇసుక ర్యాంపుల విషయంలో తాను చంద్రబాబుతో సైతం పోరాడానని గుర్తు చేశారు. అవినీతి ఎక్కడ కనిపించినా, తాను ప్రశ్నిస్తానని, అందులో సందేహం లేదని అన్నారు.
Go Back to Shorts
Sivaji
Narendra Modi
Jagan
KCR
Chandrababu

More Telugu News