పసుపు-కుంకుమ పథకం నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పసుపు-కుంకుమ పథకం నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనచేతన వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి ఈ మేరకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. పసుపు-కుంకుమ పథకం అమలు విషయమై పూర్తి వివరాలు అందించాలంటూ హైకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది.

దీనిపై, టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ తీవ్రంగా స్పందించారు. జగన్ బినామీ సంస్థ జనచేతన వేదిక ద్వారా పసుపు-కుంకుమ నిధులు అడ్డుకోవాలని పిటిషన్ వేశారని ఆరోపించారు. నిధులు రాకుండా అడ్డుకున్న వారిని ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంచితే, ఎన్నికల నేపథ్యంలో ఈసీ పసుపు-కుంకుమ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా తుది దశ చెక్కులను కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులో వేసినట్టు సమాచారం. బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండడంతో డ్వాక్రా సంఘాలకు ఇవ్వాల్సిన నగదు మొత్తాన్ని ముందుగానే బ్యాంకులో జమ చేసినట్టు తెలుస్తోంది. 
Go Back to Shorts
Telugudesam
YSRCP
New Delhi
High Court

More Telugu News