Andhra Pradesh: జగన్ అరాచకవాదిగా మారడానికి వైఎస్ విజయమ్మ పెంపకమే కారణం!: టీడీపీ నేత సాధినేని యామిని

  • అధికారం లేకుండానే జగన్ లక్షల కోట్లు దోచుకున్నారు
  • అరాచకాలు భరించలేక వైఎస్ జగన్ ను బెంగళూరుకు పంపారు
  • అమెరికాకు పంపిస్తే చదువు పూర్తిచేయకుండా వచ్చారు

వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విరుచుకుపడ్డారు. జగన్ కు సహకరించిన అధికారులంతా జైలు పాలు అయ్యారని ఆమె విమర్శించారు. అవినీతి ముద్దు బిడ్డ అయిన జగన్ ఏపీకి నిష్ట దరిద్రంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అవసరమైతే మీ బిడ్డను ఇంట్లో ఉంచుకోండి. కానీ తల్లి ప్రేమ, వాత్సల్యాన్ని అడ్డుపెట్టుకుని ఏపీలోని భవిష్యత్ తరాల జీవితాలను పణంగా పెట్టొద్దని కోరుతున్నా’ అని చెప్పారు. తమ బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలని ఏపీలోని తల్లులను యామిని కోరారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

అసలు అధికారంలోకి రాకుండానే జగన్ లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని యామిని విమర్శించారు. వాన్ పిక్, లేపాక్షి రూపంలో వేలాది ఎకరాలు దోచేశారన్నారు. అమ్మాయిలపైనా అరాచకాలు చేశారన్నారు. ఇలాంటి అరాచక వ్యక్తుల ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమైపోతామోనని ఏపీ ప్రజలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ అరాచకవాదిగా మారడానికి విజయమ్మ పెంపకమే కారణమని ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు జగన్ అరాచకాలను భరించలేక బెంగళూరులో ప్యాలెస్ లు కట్టి ఆయన్ను అక్కడకు పంపేశారని వ్యాఖ్యానించారు.

చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డితో బలవంతంగా జగన్ రాజీనామా చేయించబోతే, వైఎస్ కు సోనియా ఈ విషయం చెప్పడాన్ని మర్చిపోయారా? అని విజయమ్మను ప్రశ్నించారు. అమెరికాలో చదువుకోవడానికి పంపిస్తే అది కూడా పూర్తిచేయకుండా వచ్చిన జగన్ ను మందలించి ఉంటే ఓ తల్లిగా, వైఎస్ భార్యగా మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి ఉండేవాళ్లమని యామిని వ్యాఖ్యానించారు.

More Telugu News