Andhra Pradesh: గంటా శ్రీనివాసరావు ఒక్కో ఓటును రూ.10,000 పెట్టి కొంటున్నారు.. ఆయన స్నేహితులే ఈ విషయాన్ని చెప్పారు!: విష్ణుకుమార్ రాజు

  • గంటా దొంగ ఓట్లను సృష్టిస్తున్నారు
  • విచ్చలవిడిగా నగదును పంపిణీ చేస్తున్నారు
  • భీమిలి నుంచి వెళ్లగొడితే విశాఖపై పడ్డారు

విశాఖపట్నం ఉత్తరం నియోజక వర్గం నుంచి గెలుపొందడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు దొంగ ఓట్లను సృష్టిస్తున్నారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల పోలింగ్ ఏజెంట్లను కూడా కొనేసే ప్రమాదకరమైన వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో విచ్చలవిడిగా నగదు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. బూత్ కమిటీల్లో అన్ని రాజకీయపార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో విష్ణుకుమార్ రాజు మాట్లాడారు.

పోల్ మేనేజ్ మెంట్ లో గంటా శ్రీనివాసరావు నంబర్ వన్ అని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. ‘విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో గంటా ఓటును రూ.10,000 పెట్టి కొంటున్నారు. ఈ విషయాన్ని గంటా స్నేహితులే నాతో చెప్పారు’ అని వ్యాఖ్యానించారు. గంటా శ్రీనివాసరావును భీమిలి నుంచి వెళ్లగొడితే విశాఖపట్నంపై పడ్డారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవినీతికి మరో రూపం గంటా శ్రీనివాసరావేనని స్పష్టం చేశారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రస్తుతం విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

More Telugu News