- కర్ణాటకలోని హసన్ సభలో ఘటన
- నోరు జారిన బీజేపీ నేత
- కాంగ్రెస్ను వీడి ఇటీవల బీజేపీలో చేరిక
కర్ణాటక బీజేపీ నేత నోరు జారారు. కాంగ్రెస్ను గెలిపించే వరకు విశ్రమించబోనంటూ శపథం చేశారు. దీంతో సభా వేదికపై ఉన్న బీజేపీ నేతలు నిశ్చేష్టులై నెత్తీనోరు బాదుకున్నారు. హసన్లో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్లో సుదీర్ఘకాలంపాటు పనిచేసి ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న మంజు సభలో మాట్లాడుతూ.. 2023లో రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో హసన్ జిల్లాలోని మొత్తం 8 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ను గెలిపించి తీరుతానని, అప్పటి వరకు విశ్రమించే ప్రసక్తే లేదని ప్రతిజ్ఞ చేశారు. మంజు వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన బీజేపీ నేతలు కాంగ్రెస్ కాదు.. బీజేపీ, బీజేపీ అంటూ గట్టిగా అవరడంతో మంజు తన తప్పును తెలుసుకుని బీజేపీ అని సరిదిద్దుకున్నారు.