Andhra Pradesh: ఒంగోలులో ఓటు డబ్బుల పేరిట టోకరా .. వృద్ధురాలి గొలుసు తెంపుకుని పరారైన దొంగలు!

  • ఓ రాజకీయ పార్టీ తరఫున వచ్చామన్న దొంగలు
  • డబ్బులిస్తామనడంతో తలుపు తీసిన పెద్దావిడ
  • గొలుసు లాక్కుని పరారైన దుండగులు
సార్వత్రిక ఎన్నికలను కూడా దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. డబ్బులు పంచుతామంటూ వచ్చి నగలు లాక్కుని పరారవుతున్నారు. తాజాగా నగదు ఇస్తాం, బయటకు రమ్మని ఓ పెద్దావిడను పిలిపించిన దొంగలు మెడలోని బంగారు గొలుసు లాక్కుని పారిపోయారు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లాలోని లాయరుపేటలో ఉన్న వీఐపీ రోడ్డులో ఓ వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు ఇద్దరు దుండగులు ఆమె ఇంటి తలుపు తట్టారు. ‘అమ్మా.. ఫలానా పార్టీ తరఫున వచ్చాం. నగదు తీసుకోండి. మా అభ్యర్థికే ఓటు వేయండి’ అని చెప్పారు. దీంతో నగదుకు ఆశపడ్డ పెద్దావిడ తలుపు తీసుకుని బయటకు వచ్చింది.

వెంటనే వీరిద్దరూ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని బైక్ పై పరారయ్యారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ వారి వెంట పడింది. అయితే దొంగలు బైక్ పై వేగంగా ఉడాయించడంతో ఆమె ఏమీ చేయలేకపోయింది. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు ఇంతవరకూ కేసు నమోదు చేయలేదు.
Andhra Pradesh
ongole
Prakasam District
money
thief

More Telugu News