పాకిస్థాన్ లో భీకర ఉగ్రదాడి... 9 మంది సైనికులు మృతి

షార్ట్స్‌లో చూడండి
ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశంగా అపఖ్యాతిని మూటగట్టుకున్న పాకిస్థాన్ లో ఆదివారం ఉగ్రదాడి చోటుచేసుకుంది. బలూచిస్థాన్ రాష్ట్రంలో సైనిక కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ భీకర దాడిలో 9 మంది సైనికులు మరణించగా, 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడంతో పాక్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాక్... తాజా ఉగ్రదాడితో సౌదీ యువరాజు ఎక్కడ మనసు మార్చుకుని పర్యటన రద్దు చేసుకుంటాడోనని ఆందోళనకు గురైంది. అయితే సౌదీ ప్రిన్స్ ఇస్లామాబాద్ లో అడుగుపెట్టడంతో పాక్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. కాగా, బలూచిస్థాన్ దాడి వెనుక బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ సంస్థలు ఉన్నాయని పాక్ నిఘా ఏజెన్సీలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఆ రెండు సంస్థలు దాడికి తమదే బాధ్యత అని ప్రకటించినట్టు పాక్ మీడియా పేర్కొంది.
Go Back to Shorts
Pakistan

More Telugu News