చంద్రబాబు నియోజకవర్గంలో మహిళా ఉద్యోగికి లైంగిక వేధింపులు.. పట్టించుకోని కలెక్టర్, పోలీసులు!

  • కొంతకాలంగా వేధిస్తున్న వీఆర్ఏ ఆనంద్
  • మీడియాను ఆశ్రయించిన బాధితురాలు
  • సీఎం చంద్రబాబుపై విపక్షాల విమర్శల దాడి
తన కోరిక తీర్చేందుకు అంగీకరించకపోవడంతో ఓ వీఆర్ఏ బరితెగించాడు. ఆఫీసులో ఉన్నప్పుడు దిగిన ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని బాధితురాలు సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. ఈ ఘటన సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నియోజకవర్గమైన కుప్పంలో చోటుచేసుకుంది.

చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని ఎమ్మార్వో కార్యాలయంలో భవ్య అనే మహిళ అటెండర్ గా పనిచేస్తోంది. అయితే అక్కడే వీఆర్ఏగా పనిచేస్తున్న ఆనంద్ ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అయితే భవ్య లొంగకపోవడంతో ఆమె ఫోన్ ను దొంగలించాడు. అందులో రెవిన్యూ ఇన్ స్పెక్టర్, ఎమ్మార్వోలతో ఆమె ఆఫీసులో ఉన్నప్పుడు తీసిన ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చాడు. వీటిని జిల్లాలోని ఉన్నతాధికారులకు పంపడంతో పాటు సోషల్ మీడియాలో పెట్టడం మొదలుపెట్టాడు.

దీంతో మనస్తాపం చెందిన బాధితురాలు చివరికి జిల్లా కలెక్టర్, పోలీసులను ఆశ్రయించింది. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. కాగా, ముఖ్యమంత్రి ఇలాఖాలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంపై ప్రతిపక్షాలు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
Go Back to Shorts
Andhra Pradesh
kuppam
Chittoor District
sexual
harrasment
Police
media

More Telugu News